సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జాషువా వర్ధంతి

గుర్రం జాషువా
తెలుగు సాహిత్యలోకంలో తన కవితాశక్తితో నిలిచిన సాహితీమూర్తి అని జాషువాకు పలువురు వక్తలు నివాళులర్పించారు. గుర్రం జాషువా 36వ వర్ధంతి సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో టాంక్బండ్పై గల జాషువా విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించబడింది. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సాహితీ స్రవంతి రాష్ట్ర కన్వీనర్ తెలకపల్లి రవి జాషువా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యుదయ సాహిత్యానికి పూర్వమే సామాజిక స్పృహ, నిబద్ధతలతో జాషువా కవిత్వం పండించారని, పద్యరూపంలో ఉన్నప్పటికీ నేటికీ ఆయన సాహిత్యం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. జాషువా కడజాతి కవి కాదని, జాతి కవి అని వ్యాఖ్యానించారు. మేఘసందేశం నుండి గబ్బిలం సందేశం వరకు ప్రయాణించిన కవి గబ్బిలం కావ్యంలో పూజారి లేనివేళ దేవునికి విన్నవించమ్మా అని అనడం వరకూ కూడా అభ్యుదయ భావాల్ని తన సాహిత్యంలో ప్రతిబింబించారని అన్నారు. జాషువా పద్యాలను సందర్భానుసారంగా పేర్కొంటూ కొనసాగిన ప్రసంగం అందరిలో స్ఫూర్తిని రగిలించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సాహితీ స్రవంతి, హైదరాబాద్ నగర కమిటీ కన్వీనర్ సత్యభాస్కర్ మాట్లాడుతూ జాషువా సాహిాత్యం అణగారిన గొంతులకు ప్రేరణగా నిలుస్తుందని, విశ్వనరుడుగా భాసించిన జాషువా సాహిత్యం నేటికీ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం జాషువా వర్ధంతి నిర్వహిస్తున్నామని తెలిపారు. మామయ్య బాలల మాసపత్రిక సంపాదకులు అరిబండి ప్రసాదరావు గారు మాట్లాడుతూ జాషువా సాహిత్యంలోని మానవతా విలువలను నేటి బాలలకు అందించాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. కవి, కార్మిక నాయకుడు జి.యాదగిరిరావు మాట్లాడుతూ నేటి సమాజంలో కూడు, గూడు కోసం ఇంకా పేదలు పోరాడాల్సిన పరిస్థితి ఉందని అంటూ, పేదరికంలో ఉన్నవారు పోరాటాలలోకి రావడానికి జాషువా సాహిత్యం స్ఫూర్తిని కలిగిస్తుందని అన్నారు. జాషువా సాహితీ సంస్థ కార్యదర్శి సుమంతరావు స్మశాన పద్యాలను రాగయుక్తంగా పాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, జి.నరేష్, లోహిదాసు, వరప్రసాద్, తంగెళ్లపల్లి కనకాచారి, కెవిపిఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.