విశ్వసాహిత్యంలో కథ
-గుడిపాటి వెంకటచలం
డార్విన్కి పూర్వం ప్రపంచ వాఙ్మయం విశ్వాసంతో నడిచింది. ఏది ఎవరు గొప్పది రాసినా కొన్ని ఆదర్శాల మీదా, మానవ ఔన్నత్యం మీదా, దైవంలో విశ్వాసం మీదా కాళ్ళు మోపి నిలిచేవి, ఇంగ్లీషులో ఆ విశ్వాసాన్ని చూపిన చివరి కవులు టెన్నిసన్, బ్రవ్నింగ్, మన దేశంలో వీరేశలింగంగారు. అక్కడితో సైన్స్ ప్రాబల్యం ఎక్కువయింది. సైన్స్ ప్రపంచాన్ని ఉద్ధరిస్తుందనుకొన్నారు. వాఙ్మయమూ ఆ ఆశయంతోనే ఉండింది. మొదటి ప్రపంచ యుద్ధంతోనే సైన్స్ దెబ్బతింది.
రెండో యుద్ధంతో పూర్తిగా ఆ విశ్వాసం పోయింది. ఆనాటినించీ ఏ ఆదర్శమూ లేదు మానవులకి. తెలుగు సారస్వతంలో, చలం విరుచుకుపడడంతో ఏ ఆదర్శమూ లేకుండా ఎగిరి పోయినాయి. అతను బోధించిన శృంగారాదర్శం గిట్టనూ గిట్టదు, చిరమైన తృప్తినీ ఇవ్వదు.

చలం
ఇప్పుడు వచ్చే కథలకి ఆ గుణం లేదు. ఎందుకంటే మనుషులకి ఈ భూమిని మించిన దృష్టి లేదు గనుక. చదివే వాళ్ళు మాత్రం విశాలమైన కథల్నే కోరుతారు. కాని రచయితకి హ్రస్వదృష్టి ఏర్పడి గొప్ప కథలు రాయగలిగిన విశాల హృదయం నశిస్తోంది. మానవుడు అనేప్పటికి, ఆకలీ, డబ్బే కనబడుతున్నాయి. వాటిల్లోంచి గొప్ప రచనని సాగించడమంటే అది వాళ్ళకి చాతకాని పని అయింది. ఎందుకు? అసలు జీవితానికే అర్థం కనపడటము లేదు, నిజమైన అర్థమో, అబద్ధమైన అర్థమో. అందుకని తినడమో, బతకడమో ఏ అందమూ లేకుండా కనడమో ఇంతే కనపడుతోంది. డబ్బుతో ‘జిగిల్’ చేసి లక్షలు సంపాయించే వాళ్ళని హీరో కింద చూపే ధైర్యం లేదు. ఒక బ్లాక్ మార్కెట్ హీరోని, సినిమా డైరెక్టరుని గొప్పగా చిత్రించే కథలు కల్పించే రచయిత లేడు. అవన్నీ గిట్టని పనులు. కనుక ఆకలిలోంచి, డబ్బులోంచి పొయిట్రీ తెప్పించలేరు.
ప్రజలకి రొమాంటిక్ స్టోరీ కావాలి. అది రాయగల ప్రోత్సాహం చచ్చింది. కనకనే పత్రికలు పాత ఫారిన్ క్లాసిక్స్ని తర్జుమాలు చెయ్యడం పైని పడ్డాయి.
ఈనాడు మన దేశంలో, స్వతంత్రం ఒచ్చాక, అటు కమ్యూనిజంకాక, గాంధీజం కాక, కాపిటలిజం కాక ఏదో కొత్త స్వతంత్రాన్ని ప్రజాబాహుళ్యానికి, ఒక కొత్త ఆదర్శంగా తయారు చేస్తామన్నట్టు ఒక బాటంలేని గాలి ఐడియలిజంని మాట్లాడారు దేశ విజ్ఞాన నాయకులు. అవి వుత్త మాటలని తేలింది. ”కృషి, కృషి” దేశ సౌభాగ్యం, సంపదా, అని తక్కిన దేశాల అరుపునే కంఠస్వరం మార్చి అరిచారు – వాళ్ళు మాట్లాడేది వాళ్ళకే అర్థంకాక. అది కూడ జహ్వర్లాల్తో అంతం కాబోతోంది.
మామూలు మానవ స్వభావాన్ని పైకెత్తి జీనియస్ చూపిన శ్రీశ్రీ, సరోయన్ల వంటి గొప్ప రచయితలు ఎందరు వున్నారు? కాని వాళ్ళ విశ్వాసమైనా ఎన్నాళ్ళు నిలుస్తుంది. శ్రీశ్రీ ఇంక పైకెగరలేక చతికిలపడ్డాడు. సరోయన్ తనకి తెలీకుండనే మిస్టిసిజంలోకి వెళ్ళి సజీవమైన రచయితగా వుండిపోయినారు. మనం ఎరిగిన మట్టుకు ఇదంతా ఎందుకు రాశామో ఏమిటో.
చలం కథల్లో విలన్ సంఘం. కమ్యూనిస్టుల కథల్లో విలన్ కాపిటలిజం. కాని యీనాటి రచయితల కథల్లో విలన్ లేడు. హీరోయే విలన్, అందుకని ఏ ఆశా లేదు. సంఘం మారవొచ్చు. ఆర్థిక విధానం మారవచ్చు. కాని మానవుడు మారతాడనే ఆశ లేదు – ఈ కథల్లో.
‘ఇంతే, ఇంతే. దిక్కు లేదు. జీవితం అంటే ఇంతే’ అనే నిరాశ ధ్వనిస్తోంది.
మొదటి ప్రపంచ యుద్ధంతో యుద్ధాలు ఆఖరవుతాయనుకున్నారు. రెండో యుద్ధంతో ‘ఇంతే’ ఏం చేసీ లాభం లేదు, ఎప్పుడూ ఇంతే’ అనే నిరాశలో మునిగింది ప్రపంచం. అదే ప్రతిబింబితమవుతోంది కథల్లో. అందువల్ల వాటికి గొప్పతనం పట్టటం లేదు.
(‘కథలెలా రాయాలి’ నుండి) సేకరణ – పునర్ముద్రితము : సానెట్